ఒక మిట్ట మధ్యాహ్నపు ఎండలో
ఆకాశానికి కాషాయం పులుముతూ అంతా వీరంగం వేస్తున్నప్పుడు
త్రిశూలపు పదునుటంచుల కొసలలో
బలవంతంగా పెకలించిన గర్భస్త శిశువుల జాడ-
తొణికిన ఒక్క ఉమ్మ నీటి చుక్కయినా ముఖాలకు ఉప్పెనయి తాకకపోతుందాని
దారుల వెంట నువ్వు ఉన్మత్తుడవై వెతుకుతావు
బలిసిన ధనాగారపు ఖార్ఖానాల దోసిళ్ళలో కొన్ని కలలను టోకుగా తయారుచేసి
ఊళ్ల మీదకు రంగులురంగులుగా చిలకరిస్తున్నప్పుడు
అధికారాలలో, మతాలలో
అంచెలు అంచెలుగా అలుముకున్న ఆధిపత్యపు ఉన్మాదాలలో దేశమంటే మగతనమయి
నిటారుగా లేపుక నిలుచున్న శిశ్నాలలో పొగలు కక్కుకునే విద్వేషం దేశభక్తయి
చివరకూ ఎంతకూ కుతి తీరక యోనులలో తాగి పడేసిన సీసాలను జొనిపి -
అది నెత్తురో, కరిగి పారుతున్న దేహమో తెలియక
మండుతున్న దిసపాదాలతో అవే అవే అవే మాటలను పిచ్చిగా వదురుతూ
కనపడని ఆ జాడల వెంట ఒక ప్రళయంలా తిరిగిన చోట్లలో మళ్ళీమళ్ళీ తిరుగుతావు
ఎక్కడా దారి దొరకదు
ఎవ్వరూ ఒక్క మాటను కూడా ఆశ్వాసనగా
జ్వలిస్తున్న నీ దేహంపై కప్పరు
రాలిన పూవుల కోసం పిచ్చిగా కవితలల్లి
వాడిన ఆకులపై అదే పనిగా ఎక్కడెక్కడివో జీవజలల జాడలు వెతికి
పలవరించి మరీ మాట్లాడే పుణ్యాత్ములు ఒక్కరూ నోరు విప్పరు
అవును ప్రభూ
అంబానీలు మెచ్చినవాడూ, జనాన్నంతటినీ మూకుమ్మడిగా ఏకతాటిపై నడిపించెడివాడూ, మాయలఫకీరు వంటి వాడూ అయిన నాయకుని కోసం నా దేశమిప్పుడు కలవరిస్తోంది